తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి! బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుంపట్లు భగ్గుమన్నాయి. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, తనపై కుట్రలు జరుగుతున్నాయని కవిత బాహాటంగానే ఆరోపించారు. అంతేకాదు, కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ ఉన్నవాళ్లే దెయ్యాలు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకరకంగా తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగా కవిత మాటలున్నాయి. దీనికి కేటీఆర్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. “అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించాలి” అంటూ ఇన్ డైరెక్ట్గా కవితకు కౌంటర్ ఇచ్చారు. ఆపై కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు, తెలంగాణ జాగృతి నేతలతో ఆమె వరుస సమావేశాలు… వెరసి బీఆర్ఎస్ రాజకీయాల్లో రచ్చ రచ్చ!
మొన్నటికి మొన్న కేటీఆర్, కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యి కవిత వ్యవహారంపై చర్చించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలెవరూ ఈ విషయంపై మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించారు. అన్న చెల్లెళ్ల పంచాయితీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారగా, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం గందరగోళ వాతావరణం నెలకొంది.
పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గ్రహించిన కేసీఆర్ తన దూతలను కవిత వద్దకు పంపించారు. ఆమె అసంతృప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపై చర్చలు జరిపినా, అవి విఫలమైనట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుంటే తన దారి తాను చూసుకుంటానని కవిత తేల్చి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో, ఆమె ఆ పార్టీలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని ఆమె అనుచరులు కూడా చెబుతున్నారు.
మొత్తానికి, బీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న ఈ అసంతృప్తి జ్వాలలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు ఇది నాంది పలుకుతుందా? అన్న చెల్లెళ్ల మధ్య ఈ ఆధిపత్య పోరు ఎక్కడ ముగుస్తుంది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..