ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘వికసిత్ భారత్-2047’ మరియు ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలపై తన వినూత్న నివేదికతో ప్రధాని నరేంద్ర మోదీతో సహా సమావేశంలో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రస్తావించిన సీఎం, దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కీలక అంశాలను తన ప్రజెంటేషన్లో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు సమర్పించిన నివేదిక, అందులోని ప్రతిపాదనలు ‘వికసిత్ భారత్’ కలకు ఎంతగానో ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాకుండా, ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించడం ఈ ప్రజెంటేషన్ విజయానికి నిదర్శనం. సమావేశంలో చంద్రబాబు ప్రజెంటేషన్కు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు తన ప్రజెంటేషన్లో క్షుణ్ణంగా వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో రాష్ట్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ‘వికసిత్ భారత్’ కల సాకారంతో పాటు ‘స్వర్ణాంధ్ర’ను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను తాము ఏ విధంగా సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని వివరంగా తెలియజేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దే తన విజన్ను సీఎం పంచుకున్నారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ విశాఖ మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలు వంటి ఇతర కీలక నగరాలకు విస్తరించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా గూగుల్ AI వంటి అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి, దేశ ప్రగతికి తనకున్న దూరదృష్టిని చంద్రబాబు మరోసారి ఈ సమావేశంలో చాటి చెప్పారు.