ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి NH-67 పై బాద్వేల్ నుండి నెల్లూరు వరకు 108.134 కిలోమీటర్ల పొడవునా 4-లేన్ల కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ బృహత్తర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3653.10 కోట్లు. దీనిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (DBFOT) పద్ధతిలో నిర్మించనున్నారు.
ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఇది కీలకం?
ఈ బద్వేల్ -నెల్లూరు కారిడార్ కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే ఒక ఆర్థిక నడవా. ఇది రాష్ట్రంలోని మూడు ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్లలో కీలక ప్రాంతాలను కలుపుతుంది. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) లోని కొప్పర్తి నోడ్. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (HBIC) లోని ఓర్వకల్ నోడ్. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (CBIC) లోని కృష్ణపట్నం నోడ్. ఈ అనుసంధానం వల్ల మన దేశ లాజిస్టిక్స్ పనితీరు సూచిక (LPI) గణనీయంగా మెరుగుపడుతుంది.
ఎక్కడి నుండి ఎక్కడి వరకు?
ఈ కారిడార్ వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని గోపవరం గ్రామం వద్ద ప్రస్తుత జాతీయ రహదారి NH-67 నుండి ప్రారంభమై, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని NH-16 (చెన్నై-కోల్కతా జాతీయ రహదారి) పై ఉన్న కృష్ణపట్నం పోర్ట్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (CBIC) కింద ప్రాధాన్యత కలిగిన నోడ్గా గుర్తించబడిన కృష్ణపట్నం పోర్టుకు ఇది వ్యూహాత్మకమైన కనెక్టివిటీని అందిస్తుంది.
ప్రయాణికులకు, వాణిజ్యానికి లాభాలు:
తగ్గనున్న దూరం & సమయం: ఈ కొత్త కారిడార్ వల్ల బాదేల్ నుండి కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం ప్రస్తుతమున్న 142 కి.మీ. నుండి 108.13 కి.మీ.లకు (అంటే 33.9 కి.మీ.) తగ్గుతుంది. అంతే కాకుండా దీనివల్ల ప్రయాణ సమయం సుమారు ఒక గంట ఆదా అవుతుంది. ఇంధన వినియోగం తగ్గి, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. వాహన నిర్వహణ ఖర్చు (VOC) కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఉపాధి అవకాశాలు:
ఈ 108.13 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ద్వారా సుమారు 20 లక్షల పని దినాల ప్రత్యక్ష ఉపాధి, 23 లక్షల పని దినాల పరోక్ష ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కారిడార్ సమీప ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల అదనపు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
ఈ బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించనుంది. ఇది రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, పారిశ్రామిక ప్రగతికి, వాణిజ్య విస్తరణకు, మరియు ఉపాధి కల్పనకు దోహదపడి, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.