మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల్లో తేడాలు : రేవంత్ రెడ్డి

revanth-reddy-cabinet.jpg

మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించిన లెక్క‌లు తేడాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని అధికారులకు సూచించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని అధికారులను ఆదేశించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది వ‌ర‌కు జీఎస్టీ ప‌రిహారం కింద రూ.4 వేల కోట్ల‌కుపైగా చెల్లించేద‌ని, దాని గ‌డువు ముగియ‌డంతో ఆ నిధులు రాక‌పోవ‌డంతో రాబ‌డిలో వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని అధికారులు తెలిపారు.

పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాల‌ని అధికారులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాల‌కు సంబంధించిన లెక్క‌లు తేడాలు ఉంటున్నాయ‌ని, ఈ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తి డిస్ట‌ల‌రీ వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చి వాటిని ట్రాకింగ్ చేయాల‌ని, బాటిల్ ట్రాకింగ్ సిస్టం ఉండాల‌ని, మ‌ద్యం స‌ర‌ఫ‌రా వాహ‌నాలు వే బిల్లులు క‌చ్చితంగా ఉండాల‌ని స్పష్టం చేశారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్‌తో పాటు గ‌తంలో న‌మోదు చేసిన ప‌లు కేసుల పురోగ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

Share this post

submit to reddit
scroll to top