తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు : రేవంత్ రెడ్డి

revanth reddy review
  • తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు
  • ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం
  • బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి
  • వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫీజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని సీఎం తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్‌పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించి కోర్టులో ఉన్నందున, కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు.

మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరచాలని అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా వున్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. అలాగే జూనియర్ డాక్టర్స్, ఆశ వర్కర్స్, స్టాఫ్ నర్సుల జీతాలు ప్రతి నెల క్రమం తప్పకుండ అందించేలా చూడాలన్నారు. 108,102 సేవల పనితీరును ముఖ్యమంత్రి అరా తీశారు, మెరుగైన సేవలు అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..