బంగారం కొనేవారికి శుభవార్త! అంతర్జాతీయ పరిణామాలు, తగ్గుతున్న డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల భౌగోళిక ఉద్రిక్తతలతో ఆకాశాన్నంటిన బంగారం ధర, ఇప్పుడు కాస్త శాంతించడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతుండటమే ధరల పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర ఏకంగా రూ.1800 మేర దిగొచ్చి రూ.95,050కి చేరింది (పన్నులతో కలిపి). 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ.94,600 వద్ద నమోదైంది. ఇక మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఇక్కడ 10 గ్రాముల పసిడి ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ప్రియులకు కూడా ఇది శుభవార్తే. వెండి ధర కూడా నేడు భారీగా తగ్గింది. దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.1000 మేర తగ్గి ప్రస్తుతం రూ.97 వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.98 వేలుగా ఉండేది.
అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే, స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 16 డాలర్లు తగ్గి 3160 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది